మాణిక్యాంబ దేవి

(12వ శక్తి పీఠం)

దక్షనాటీస్థితా శక్తీ!
విఖ్యాతా మాణిక్యాంబికా!!
వరదా శుభదా దేవీ !
భక్త మోక్ష ప్రదాయినీ
!!

అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ 

బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.

దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా  సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.

మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి  తన ఆఖరి  ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.

మాణిక్యాంబ దేవి శక్తి పీఠం

అస్టాదశ శక్తిపీఠములలో 12వ శక్తి పీథము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామనందున్న మాణిక్యాంబాదేవి శక్తిపీఠము. సతీదేవి ఖండితాంగాలలో ఎడమచెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈప్రాంతమనీ ఆచక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడఉన్నాడనీ స్థలపురాణం. ఒక పర్యాయము శివుడు వ్యాసమహర్షిని పరీక్షింప కోరి ఒక రోజు కాశీనందు ఆయనకు భిక్ష దొరకకుండా చేసియాడు. వ్యాసునికి ఆకలి వేసి సహనము కోల్పోయి కాశీని శపింపబోగా, అన్నపూర్ణ ఆటానికి భోజనము పెట్టినది. శివుడు మహర్షిని కాశీ వదలి వెళ్ళమనగా అమ్మవారు కాశీతో సమానమైన  ద్రాక్షారామ వెళ్ళమని సలహా ఇచ్చినది. వ్యాసుడు ద్రాక్షారామను దక్షణకాశీగా అంగీకరించి శివుని అర్చించి వ్యాసకాశీగా పేరు పెట్టినాడు. శివుడు కాశీకి అర్ధము ఆత్మవిముక్తి పొందడమేనని సుఖవంతమైన జీవితము పొందుటకు కాదని వ్యాసునికి చెప్పినాడు. కానీ భీమఖండములో ద్రాక్షారామకు ఆత్మవిముక్తి పొందుట మరియు సుఖమయ జీవితము పొందుటకు అర్హమైనదీగా పేర్కొన బడినది. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.  

Manikyamba Devi Temple

శివుడు ద్రాక్షారామ ఆలయమునందు సతీదేవి భాగము అనగా మాణిక్యాంబను ప్రతిష్టించినాడని నమ్మకము. సుమారు 1200 సంవత్సరములకు పూర్వము ఆదిశంకరాచార్యులవారు ఈ ఆలయమును దర్శించి మాణిక్యాంబ విగ్రహమువద్ద శక్తివంతమైన శ్రీచక్రము నెలకొల్పినారు. ఆలయ సమీపములో సతీదేవి శరీరము విడచిన ప్రదేశము మరియు దక్షప్రజాపతి హోమము నిర్వహించిన హోమకుండము కలదు. ఆ హోమకుండము ప్రస్తుతము చిన్న కోనేరు రూపు దాల్చినది. సతీదేవి విగ్రహము కోనేటి మధ్యలో నెలకొల్పబడినది మరియు ఈ హోమ కుండమునకు సమీపములో చిన్న చిన్న దేవాలయములు కలవు. మరియొక కధనము ప్రకారము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు ఆచరించి శివుని నుండి ఆత్మలింగము వరముగా పొందినాడు. పిమ్మట దేవతలను అనేక భాధలు పెట్టినాడు. పార్వతిమాతకు మహా శివునితో వివాహము అయిన పిమ్మట వారికి షణ్ముఖుడు జన్మించినాడు. షణ్ముఖుడు తారకాసురునితో యుద్ధము చేసి యుద్ధములో తారకాసురుని కంఠమునందున్న ఆత్మలింగమును నాశనముచేసి తారకాసురుని వధించినాడు. ఆ ఆత్మలింగము అయిదు పంచారామములుగా పిలువబడుచున్న అయిదు దివ్యప్రదేశములందు పడినవి. ఈ పంచారామములు ఆంధ్రప్రదేశ్ నందే ఉన్నవి. అవి ఇంద్రునిచే గుంటూరు జిల్లా అమరావతిలో నెలకొల్పబడిన అమరేశ్వరుడు, చంద్రునిచే పశ్చిమగోదావరి జిల్లా భీమవరమునందు నెలకొల్పబడిన సోమేశ్వర్రుడు, శ్రీరామునిచే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లునందు నెలకొల్పబడిన క్షీరారామలింగేశ్వరుడు, తూర్పుగోదావరిజిల్లా సామర్లకోటనందు షణ్ముఖునిచే నెలకొల్పబడిన కుమార రామభీమేశ్వరుడు మరియు తూర్పుగోదావారిజిల్లా ద్రాక్షారామనందు స్వయంభూఃగా వెలసిన భీమేశ్వరుడు. ఋషులు గోదావరి నదీమాతను ద్రాక్షారామనందు పడిన ఆత్మలింగ భాగమును ప్రతిష్టచేయమని కోరగా ఆమె ఆలశ్యము చేసినది. అందువలన శివుడు తనంత తానుగా ద్రాక్షారామ నందు ఉద్భవించినాడు. సప్తఋషుల కోరికపై గోదావరి ఇచ్చటకు వచ్చినది. సప్తగోదావరి పేరుతో ఆలయమునకు తూర్పువైపున పుస్కరిణి యున్నది.

మాణిక్యాంబ దేవి ఆలయ సమయాలు

ఆలయము మాసశివరాత్రి రోజున ఉదయం 5-30 నుండి రాత్రి 9-00 వరకు, మిగిలినరోజులలో ఉదయం 5-30 నుండి 12-00 వరకు తిరిగి మధ్యాహ్నం 3-00 నుండి రాత్రి 8-00వరకు మరియు కార్తీక మాసములు ఉదయం 5-00 నుండి 12-30వరకు తిరిగి మద్యాహ్నం 3-00 నుండి 8-30 వరకు తెరచి ఉంటుంది. దేవస్థాన సత్రములు మరియు అతిధి గృహములు ఆన్ లైన్ ద్వారా రిజర్వేషను లభ్యము. ఇవి కాక హోటల్స్ కూడా లభ్యము.