గిరిజా దేవి

(11వ శక్తి పీఠం)

ఓడ్రదేశే భువనే!
శ్రీ గిరిజానామ సంస్థితా !!  
పాలికాఖిల లోకానాం !
పల్లదారుణ పాణినా !!

అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ 

బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.

దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా  సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.

మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి  తన ఆఖరి  ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.

బిరాజ‌దేవి శక్తిపీఠం

ఈ అస్టాదశ శక్తిపీఠములలో 11వ శక్తిపీథము ఒరిస్సా రాష్ట్రములో జాజ్ పూర్ నందున్న బిరిజాదేవి శక్తిపీఠము. ఇచట సతీదేవి శరీరభాగములలో నాభి పడినదని శాస్త్రము.

గయాక్షేత్రములు మూడింటిలో నాభిగయగా ఈ క్షేత్రము ప్రసిద్ధిచెందినది. ఈ క్షేత్రదర్శనము పాప వినాశకరము, పితృముక్తికరము. సర్వ దుఖ వినాశకరము, సర్వాభీస్ట సిద్ధి ప్రదము. ఈ క్షేత్ర దర్శనము పాపవినాశకరము, పితృముక్తికరము. సర్వ దుఖవినాశకరము, సర్వాభీస్ట సిద్ధిప్రదము. కృతయుగమున గయాసురుడు అను పరమ భాగవతోత్తముడైన రాక్షసుడు తీవ్రతపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడుగగా గయా సురుడు భూలోకమునందున్న అన్ననదులకంటే తనశరీరము పవిత్రమగునట్లు వరము కోరినాడు. విష్ణువు అట్లే అని వరము ఇచ్చినాడు. పవిత్ర దేహియైన గజాసురుని దర్శించినంతనే  పంచ మహాపాతకులు, క్రిమికీటకాది జన్మలెత్తిన పాతకులు గయాసురుని శరీరమునుండి వెలువడు గాలి సోకిన మాత్రమునే తరించేదివారు. 

Maa-Biraja-Temple-Odisha

ధర్మాత్ముడైన గయాసురుడు అనేక అశ్వమేధాది క్రతువులు చేసినాడు. శతక్రతువులు చేసినవారికి ఇంద్రపదవి వస్తుంది. ఆ రకముగా గయాసురుడు ఇంద్రపదవి పొందగా ఇంద్రుడు పదవీత్యుతుడు అయినాడు. ఇంద్రుడు మరలా ఇంద్రపదవి పొందుటకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గురించి తీవ్ర తపస్సు చేసినాడు. త్రిమూర్తులు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడుగగా ఇంద్రుడు గయాసురుడు మంచివాడైననూ  ఆతని అనుచరులు భూలోకములోని ప్రజలను కస్టములకు గురిచేయుచున్నారని అందువలన వారు క్రతువులు చేయక ఆవిస్సులు రాక దేవతలు బలహీన పడుచున్నారని అందువలన గయాసురుని వధించి తనసింహాసనము తనకు ఇప్పించ కోరినాడు. గయాసురుని సామదాన బేధదండోపాయములలో దానము ద్వారా జయించి నిర్జించవలెనని తలచి త్రిమూర్తులు బ్రాహ్మణ వేషదారులై గయాసురుని తాము ఏడు రోజులు యాగము చేయుటకు సంకల్పించినామాని ఆయాగము చేయుటకు స్థలము కావలెనని, ఆయాగము సాధారణ భూమి భరించలేదని పుణ్యక్షేత్రములు కూడా పాపాత్ములు స్నానము, దానము, తపము యాగాదులు చేయుట వలన పాప పంకిల మయినవని అందువలన అవి ఏమియు తమ యాగమునకు పనిచేయవని, పుణ్య భరితమైన గయాసురుని దేహము యజ్నవేదికగా పనిచేయుననని, గతములో విష్ణుమూర్తి నుండి భూమండలములోని అన్ని పుణ్యక్షేత్రములకంటే అతనిశరీరము పుణ్యవంతమైనదిగా నుండునట్లు వారము పొందియుండుటవలన గయాసురుని శరీరము  యజ్ణము చేయుటకు వారము దినములు కావలెనని,  తాము యజ్ణము చేయు పర్యంతము శరీరమును కదల్చరాదని అట్లు కదిపిన ఆతనిని సంహరించె దమని  తెలుపుచూ ఆతని శరీరము కోరినారు. అంతట గయాసురుడు తన శరీరముపై యజ్ణము చేయుటకు అంగీకరించుచూ తన శరీరమునందు తలభాగము ప్రస్తుత బీహార్ రాష్ట్రములోని గయ నందు శిరస్సు ఉండునట్లు, నాభిస్థానము ఒరిస్సాలోని జాజిపూర్ నందు పాదములు ఆంద్ర ప్రదేశ్ లోని పిఠాపురములో ఉండునట్లు శరీరము విస్తారము చేసి త్రిమూర్తులను యజ్ణము ప్రారంభించమని ప్రార్ధించినాడు. విష్ణుమూర్తి తలభాగమునందు, బ్రహ్మ నాభిభాగమునందు, పరమేశ్వరుడు కాళ్ళ భాగమునందు ఉండి యజ్ణము ప్రారంభించినారు. గయాసురుడు యోగవిధ్యచే శరీరము కదలకుండా చేసుకొని ప్రతిరోజూ కొడికూతను బట్టి ఎన్ని రోజులు అయినది లెక్కించుకో సాగాడు. ఆ రీతిన ఆరు రోజులు గడచిన పిమ్మట ఇంద్రుడు మరలా త్రిమూర్తులను ప్రార్ధించగా శివుడు ఏడవరోజు తెల్లవారుఝామునకాక  లింగోద్భవ కాలమున (మహాశివరాత్రి  రోజు అర్ధరాత్రి) కొక్కురుక్కో అని కుక్కుట ధ్వని చేసెను. ఈ మాయ తెలియని గయాసురుడు ఏడు రోజులు  పూర్తి అయినవని సంతోషముతో దేహము కదిలించగా యజ్ణము పూర్తికాకుండానే శరీరము కదల్చినావు  కావున నిన్ను సంహరిస్తామని త్రిమూర్తులు తెలిపారు. గయాసురుడు దివ్యదృస్టితో ఇంద్రుని మాయోపాయము, త్రిమూర్తులు బ్రాహ్మణ రూపముతో వచ్చుట, తన శరీరమును యజ్ణవేదికగా అడుగుట, శివుడు కోడిరూపములో తనను మోసగించినాడని తెలిసి త్రిమూర్తుల చేతిలో మరణించుట ముక్తికరమని తనను వధించమని కోరినాడు. అంతట త్రిమూర్తులు  చివరి కోరిక కోరు కొమ్మని అడుగగా గయాసురుడు తాను మరణించినపిమ్మట తన శరీరములోని  మూడు భాగములు త్రిగయా క్షేత్రములుగాను మూడు క్షేత్రములలోనూ త్రిమూర్తులు ముగ్గురు నివసించునట్లు  మూడు క్షేత్రములు శక్తి పీఠములుగా విరాజిల్లునట్లు, మరణించిన పితరులకు ఈ మూడు క్షేత్రములలో కర్మకాండ పితృకర్మలు చేయుట   వలన బ్రహ్మ పదము కలుగునట్లు, నామోచ్చారణ పూర్వకముగా పితృ శ్రాద్ధము వలన  వార్కి గయాశ్రాద్ధ ఫలితము తద్వారా  బ్రహ్మపదము పొందునట్లు వరమును కోరినాడు. శిరోగయ బీహార్ రాష్ట్రములో  విష్ణు పాదములు మరియు మంగళ గౌరి శక్తి పీఠము కల గయనందు,  నాభిగయ ఒరిస్సా రాష్ట్రములో యజ్ణవేదికా స్వరూపుడు బ్రహ్మదేవుడు మరియు  గిరిజాదేవి శక్తి పీఠముకల జాజిపూర్ నందు, పాదగయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కుక్కుటేశ్వరుడు మరియు పురుహూతికా దేవి శక్తిపీఠము కల పిఠాపురమునందు త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ది చెందినవి. పాడగయా క్షేత్రము పితృ ముక్తి కరము. సర్వ పాపహారము. శిరోగయ (భీహార్), నాభిగయ (ఒరిస్సా), పాదగయ (ఆంధ్ర ప్రదేశ్), మాతృగయ (సిద్ధాపూర్, గుజరాత్) మరియు బ్రహ్మకపాలం (బదరీనాథ్, ఉత్తరాఖండ్) ఈఅయిదు పితృముక్తికర క్షేత్రములు.

గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతో బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మితవదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉన్నది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉన్నది. ప్రస్తుత ఆలయము సుమారు ఏడు వందల సంవస్సారముల క్రిందట నిర్మించినది. ఈ ఆలయములో విరిజాదేవి లేదా గిరిజా దేవిగా పూజింపబడు దుర్గాదేవి ప్రధాన దేవత. జాజిపూర్ ను  విరిజా క్షేత్రమని బిరిజా పీఠమనీ కూడా పిలచెదరు. ఈ దుర్గా మాత విగ్రహము రెండు చేతులు ఒక చేతిలో మహిసాసురుని రొమ్ము ఈటె గుచ్చుచూ రెండవ చేతితో మహిషాసురుని తోక గట్టిగా లాగుతూ ఒక కాలు సింహము పైననూ మరియొక కాలు మహిషాసురుని రొమ్ముపైన కలిగి ఉంటుంది. మహిసాసురుడు గేదె ఆకారములో చిత్రీకరించబడినది. అమ్మవారి కిరీటముపై గణేశుడు, నెలవంక మరియు లింగము కలిగి ఉంటుంది. ఈ ఆలయ సముదాయం ఎక్కువ విస్తీర్ణములో శివుడు తదితర అనేకమైన ఆలయము లతో ఉంటుంది. స్కంద పురాణమునందు ఈ క్షేత్రమును విరిజ లేదా బిరిజా క్షేత్రము అని కోటి శివలింగ క్షేత్రమని తలచెదరు. ఇచ్చట గల నాభిగయ యందు పితృ పూజ అనగా పిండ ప్రధానము, తర్పణము, తీర్ధవిధులు జరిపేదరు. ఇందు నిమిత్తము ఈ ఆలయములో పూజారులు అవసరమైన సదుపాయములు కలుగ చేసేదరు. మహాలయ పక్షమునకు ముందు కృష్ణ పక్ష అస్తమినాడు ఇచట శారదీయ దుర్గాపూజ ప్రారంభమై అశ్వని శుక్లపక్ష నవమినాడు మురుస్తుంది. సింహద్వజగా పిలువబడు రధయాత్ర  అనే పల్లకీ ఉత్సవము యందు జెండా సింహము కలిగి యుంటుంది. నవరాత్రి ఇచట అపరాజిత పూజాగా నిర్వహించ బడుతుంది. ఇవే కాక నక్ష్త్ర, శ్రావణ తదితర పండుగలు చేసేదరు. ప్రతిరోజూ అమ్మవారిని మహిసాసుర మర్ధినిగా తంత్ర మరియు ఆగమ శాస్త్ర పద్ధతిలో జైపూర్ బ్రాహ్మలచే పూజలు జరుపబడతాయి. 

గిరిజా దేవి ఆలయం చేరుకోనే మార్గం

జాజిపూర్ వెళ్ళుటకు చెన్నై నుండి హౌరా రైలు మార్గములో గల రైల్వే స్టేషను జాజిపూర్ రోడ్ ఆచటినుండి టాక్సీ లేదా ఆటోలో వెల్లవలసి ఉంటుంది. లేదా కటక్ చేరి ఆచటి నుండి బస్సులో వెళ్లవచ్చును. కటక్ నుండి జాజిపూర్ సుమారు 3 గంటలు మరియు జాజిపూర్ రోడ్ నుండి సుమారు 1గంట సమయము పట్టును. భువనేశ్వర్ నుండి కూడా బస్సులు కలవు.